భద్రాచలం, ఫిబ్రవరి 3: ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్ మరోమారు ఊపందుకుంటున్నది. కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక, పిచ్చుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించి మాట్లాడారు. భద్రాచలం ప్రాంత ప్రజలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ధ్వజమెత్తారు. విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపేందుకు కేంద్రానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. దీక్ష శిబిరాన్ని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సీపీఎం, టీడీపీతోపాటు వివిధ సంఘాల నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. కాగా భద్రాచలంలో గురువారం జరిగిన సీపీఎం పట్టణ కమిటీ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏజే రమేశ్ మాట్లాడుతూ.. నిరంతరం రామజపం చేసే బీజేపీకి భద్రాచలం రాముడిపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు.
వంతెనపై రాస్తోరోకో
ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీలను తెలంగాణకు తిరిగివ్వాలన్న డిమాండ్తో ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన తూరుబాక వంతెనపై కన్నాయిగూడెం వాసులు రాస్తోరోకో నిర్వహించారు. అక్కడి జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ పంచాయతీలను పాడేరులో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ‘మాకు పాడేరు వద్దు.. తెలంగాణ ముద్దు’ అని డిమాండ్ చేస్తూ ఈ రాస్తారోకోకు దిగారు.