ఖమ్మం : దేశానికి బీజేపీ ప్రమాదం ముంచుకొస్తున్నందున ఆ పార్టీ వ్యతిరేక శక్తుల సమీకరణే లక్ష్యంగా తమ పార్టీ ముందుకెళ్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నూతన ఆర్థిక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తూ ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తోందని ధ్వజమెత్తారు.
ఖమ్మంలోని మంచికంటి భవన్లో సోమవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. రాజకీయ వైఖరి రీత్యానే బీఆర్ఎస్తో మైత్రి కొనసాగుతున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తమ జాతీయ కమిటీ పిలుపు మేరకు మార్చి 17 నుంచి ప్రజాగర్జన యాత్రలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు బృందాలుగా ప్రారంభమయ్యే ఈ యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్పొరేట్ తొత్తుగా మారిన బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ యాత్ర కొనసాగుతుందన్నారు.
బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు. అక్రమ పద్ధతిలో మోదీ ప్రభుత్వం అందించిన సహకారంతోనే అదానీ ప్రపంచ కుబేరుల స్థానంలో నిలిచారని హిండెన్బర్గ్ నివేదిక సృష్టం చేసినట్లు గుర్తుచేశారు. తమ వ్యతిరేక శక్తులను బెదిరించేందుకే బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకుంటోందని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోయి ఉంటే అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు బీజేపీ అంగీకరించేది కాదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలవకపోయి ఉంటే అసంతృప్తి నేతలు బీజేపీ దారిపట్టేవారని అన్నారు. ఆ ఎన్నికల్లో రాజకీయ వైఖరి రీత్యానే బీఆర్ఎస్కు మద్దతునిచ్చామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.