శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 4: నిజాంను తరిమిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని దెబ్బతిస్తున్న బీజేపీని తెలంగాణ ప్రజలు తరిమికొట్టాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు. ప్రజల మధ్య చిచ్చురేపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని కోరారు. తిండిపై, బట్టపై జీఎస్టీ పేరుతో మోదీ ప్రధాని దోచుకొని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సీపీఐ మూడో రాష్ట్ర మహాసభల సందర్భంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జల్పల్లిలో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడానికి లౌకికవాదులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. మూడురోజులపాటు జరిగే రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ రాజకీయాలపై చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ అంబానీ, అదానీలు ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్న బీజేపీని రాజకీయంగా బొందపెట్టాలని సూచించారు. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలు బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలన్నారు. సభలో పార్టీ నాయకులు అతుల్కుమార్ అంజాన్, పల్లా వెంకట్రెడ్డి, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
సభలో అలరించిన వందేమాతరం శ్రీనివాస్ పాటలు
బహిరంగ సభలో ప్రముఖ గేయ రచయిత వందేమాతరం శ్రీనివాస్ పాటలతో అలరించారు. ఆయన పాడిన ఎర్రజెండా పాటలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండాలను చేతపట్టుకొని నృత్యం చేశారు.