హైదరాబాద్ : దేశంలో ఎన్నికల సంసరణలు రావాల్సిన అవసరమున్నదని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ పార్టీ బీజేపీ అని, అధికారంలోనికి వచ్చేందుకు ఆ పార్టీ విపరీతమైన డబ్బులను వెదజల్లుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. ఎన్నికలకు ముందే ఫాసిస్ట్, మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉమ్మడి అవగాహనకు రావాల్సిన అవసరముందన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను, అధికారాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అణచివేస్తోందని ధ్వజమెత్తారు.
సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి హైదరాబాద్ మగ్ధుంభవన్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. జాతీయ విద్యావిధానాన్ని, జీఎస్టీలను కేంద్రం రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతుందని విమర్శించారు. భారతదేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో రాష్ట్రంలో విచారణ కొనసాగుతోందని, మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇలాగే ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. సంక్షేమ దేశంగా ఉన్న భారతదేశం మోదీ పాలనలో పెట్టుబడి భారత్గా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకూ నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, నిరుద్యోగం విపరీతంగా పెరుగుతోందని విమర్శించారు. ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామన్న మోదీ హామీ ఏమైందని నిలదీశారు.
ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ పాలనలో గవర్నర్ల జోక్యం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను గవర్నర్లు ముందుకు తీసుకెళ్తున్నారని, ఇటీవల తమిళనాడు గవర్నర్ సనాతన ధర్మాన్ని ప్రస్తావించిన విషయాన్ని రాజా గుర్తు చేశారు. కేరళ, తమిళనాడు, బెంగాల్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్రం గవర్నర్ వ్యవస్థను ఉపయోగిస్తోందని విమర్శించారు. ఎన్నికల సంసరణలపై సీపీఐ నేత ఇంద్రజిత్గుప్తా నేత్వత్వంలోని కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్య,రాజ్యాంగ, లౌకికపరిరక్షణకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, ప్రాంతీయ పార్టీలు ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా రాబోయే 2024 లోక్ సభ ఎన్నికల అవగాహనతో ముందుకెళ్లాలన్నారు.