హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించకుండా లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేమని స్పష్టంచేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించే బాధ్యత వామపక్షాలతోపాటు దేశంలోని లౌకిక, ప్రగతిశీల శక్తులు, పార్టీలపై కూడా ఉన్నదని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తొలిసారిగా నిర్వహించిన సీపీఎం, సీపీఐ సంయుక్త సమావేశానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజాతోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీ రాజా మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో సంక్షోభం సృష్టిస్తూ, రాజ్యాంగాన్ని, సమాఖ్య స్ఫూర్తిని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీని ఐక్యత ద్వారానే ఓడించగలమని చెప్పారు. ఆరెస్సెస్ సిద్ధాంతం ఫాసిస్టు సిద్ధాంతమని, ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, అదీ మోదీ అనే స్థాయికి వారి ఉన్మాదం చేరుకున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్లను ఆయుధంగా మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరుస్తున్నారని ధ్వజమెత్తారు. 2024లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఓడిస్తామని చెప్పారు. ఎర్రజెండాలు రెండు కాదు- ఒక్కటేనని నిరూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి సమావేశం దేశానికే స్ఫూర్తిదాయకమని అన్నారు.
మోడీని ఓడించలేమనడం వాస్తవం కాదు : ఏచూరి
దేశంలో మోదీ వేవ్ ఉన్నదన్న ప్రచారంలో వాస్తవం లేదని, అదంతా బీజేపీ అనుకూల మీడియా సృష్టేనని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 180 స్థానాలకు గాను బీజేపీ 46 స్థానాలు మాత్రమే గెలిచిందనీ, 58 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని ఉదహరించారు. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోయిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన రాష్ర్టాల్లో సీబీఐ, ఈడీ, డబ్బు ప్రలోభాలను ప్రయోగించి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి రావడమే బీజేపీ పనిగా పెట్టుకున్నదని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం, లౌకివాదాలను కాపాడుకునేందుకు ఒకవైపు ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూనే మరోవైపు బీజేపీని ఓడించేందుకు లౌకికవాదులు, ప్రగతిశీల శక్తులు కలిసి రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రెండు కమ్యూనిస్టు పార్టీల మధ్య కింది స్థాయి నుంచి ఇలాంటి ఐక్యత రావడం ఈ దశాబ్దంలో ఎకడా జరగలేదని, ఈ కృషి కొనసాగాలని అన్నారు. దీనిపై కేంద్ర కమిటీల స్థాయిలో చర్చిస్తామని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో ఆయా నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ ఓటమికి ప్రయత్నించాలని అన్నారు. జాతీయ స్థాయిలో ఎన్నికల తరువాతే ఫ్రంట్లు వస్తాయని చెప్పారు.
సీట్లు ముఖ్యం కాదు: తమ్మినేని
ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల గురించి వామపక్షాలు ఎప్పుడూ లెక్కలు వేసుకోవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో కాషాయ జెండాను ఎగురనివ్వబోమని తెలిపారు. కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉన్నదా? లేదా? అని కాకుండా కమ్యూనిస్టులు లేకపోతే భారతదేశానికి భవిష్యత్తు ఉన్నదా? అనేది ఆలోచించాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, సీపీఎం పొలిట్ సభ్యుడు బీవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వం: కూనంనేని
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనీయకుండా చూడటమే కర్తవ్యంగా పెట్టుకుందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు ఒకే ఎర్రసైన్యంలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.