CPI Koonamneni | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : జంతర్ మంతర్ వద్ద ఆదివారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళ రెజ్లర్లపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఓ సమావేశంలో మాట్లాడారు. దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద దేశానికి ఎన్నో పతాకాలు గెలిచి కీర్తి సంపాదించి పెట్టిన క్రీడాకారులపై రెజ్లర్ల శిక్షణ విభాగానికి చీఫ్ కోచ్గా ఉన్న ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, గత 35 రోజులుగా రెజ్లర్లు తీవ్ర నిరసన తెలుపుతున్నా, దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహావేషాలు వ్యక్తం చేస్తున్నా, ఇప్పటికీ ఎంపీని అరెస్టు చేయకపోవడం మహిళల పట్ల బీజేపీకి ఉన్న వైఖరికి అద్దం పడుతున్నదని విమర్శించారు.
ఒకవైపు నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం జరుపుకుంటూ, ప్రజాస్వామ్య పద్ధతులలో ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లపై అరాచక పద్ధతులలో దాడిచేయడం అత్యంత అమానుషం అని కూనంనేని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వాళ్ళని నిర్బంధిస్తుండటం వల్లే, తప్పు చేసిన వారు రాజులాగా యదేచ్ఛగా బయట తిరుగుతున్నారన్నారు. `బేటీ బచావో- బేటీపడావో` అనే పేరుతో ఆడపిల్లలను `చదివించు, రక్షించు` అని చెబుతూనే మహిళలను భక్షిస్తున్నారని సాంబశివరావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహించి మహిళలకు క్షమాపణ చెప్పాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ను వెంటనే అరెస్టు చేయాలని సాంబశివరావు డిమాండ్ చేశారు.