Munugode by Poll Results | ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వం ఈ దేశానికి అసవరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మోదీని ఎదుర్కొనే శక్తి ఒక్క కేసీఆర్కు మాత్రమే ఉందని ఆయన తేల్చిచెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో టీ న్యూస్ వేదికగా నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు దిశగా ముందుకెళ్లడం సంతోషంగా ఉంది. కచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీని కేసీఆర్ దైర్యంగా ఎదుర్కోగలుగుతారనే విశ్వాసం ఉంది. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. మతపరమైన భావజాలంతో సమాజాన్ని చీల్చివేస్తున్నారు. దీంతో బీజేపీని ఓడించాలనే కృతనిశ్చయంతో టీఆర్ఎస్కు మద్దతిచ్చాం. ఈ దేశానికి కేసీఆర్ లాంటి నాయకులు అవసరం. గొంతు అవసరం. ఈ ఫలితం సంతోషాన్నిస్తుంది అని పేర్కొన్నారు.
బీజేపీ నాయకులు మునుగోడును ఒక ప్రయోగశాలగా చేయాలనుకున్నారు. మునుగోడులో వాస్తవానికి బీజేపీకి బలం లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు 18 నుంచి 20 వేల ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత బీజేపీ పోటీ చేసినప్పుడు 10 వేల ఓట్లు వచ్చినట్లుంది. కాంట్రాక్టులు ఇవ్వడం, ఆ తర్వాత రాజీనామా చేయడం, వెంటనే ఎన్నికలు రావడమనేది ప్రజలకు అర్థమైపోయింది. స్వార్థం కోసం వచ్చిన ఎన్నిక అని ప్రజలు గుర్తించారు. బీజేపీని ఓడించాలనే సంకల్పంతో ప్రజలు ఉన్నారు. కమ్యూనిస్టులు కూడా తోడవడంతో.. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
8 ఏండ్ల కాలంలో బీజేపీ చేసిందేమీ లేదు. కేసీఆర్ నాయకత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు. స్వయం ఉపాధితో బతుకుతున్నారు. మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం అయింది. గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. కృష్ణా నది కేటాయింపుల్లో కేంద్రం అలసత్వం ప్రదర్శించడం సరికాదన్నారు. మహిళలు, వృద్ధులు, రైతులు అందరూ టీఆర్ఎస్కే ఓటేశారు. ప్రజలు అమాయకులు కాదు. ప్రలోభాలకు లొంగిపోలేదు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అని ప్రజలు గుర్తించారు. ఇప్పుడు వచ్చిన ఓట్లు రేపటికి బీజేపీ రావు. బండి సంజయ్ తన సొంత నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదు. బీజేపీకి సొంత బలం లేదు అని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.