కాగజ్నగర్ ఎస్పీఎం కాలనీ, డిసెంబర్ 12: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వంజిరికి చెందిన అల్లూరి గులాబ్ దాస్.. ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పశువులను మేపుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెద్దపులి ఓ పశువుపై దాడి చేసింది.
ఇది గమనించిన గులాబ్ దాస్.. తన చేతిలోని కర్రతో పులిని బాదాడు. పులి ఒక్కసారిగా అతనిపై దాడి చేసి పారిపోయింది. కేకలు వేయడంతో ఆ ప్రాంతంలోనే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్బంది గమనించి అక్కడికి చేరుకున్నారు. చేతికి, నడుంపై గాయాలు కావడంతో పశువులకాపరిని హుటాహుటిన కాగజ్నగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రాణాపాయం ఏమీ లేదని అధికారులు తెలిపారు.