జహీరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 65వ జాతీయ రహదారిపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి గ్రామ శివారులో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. జహీరాబాద్ బీదర్ రోడ్డుపై రాష్ట్ర సరిహద్దులో ఉన్న గణేష్పూర్ శివారులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నెగిటివ్ రిపోర్టు వస్తేనే రాష్ట్రంలోకి వారిని అనుమతిస్తున్నారు. పాజిటివ్ ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు కఠిన నిబంధనలు అమలు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.
చెక్పోస్టుల వద్ద 24 గంటల పాటు పోలీసులు అందుబాటులో ఉండనున్నారు. ఎస్ఐ స్థాయి అధికారితో పాటు పోలీసులు వైద్యాధికారి వైద్య సిబ్బంది పరీక్షలు చేసి అనుమతిస్తున్నారు.