సిద్దిపేట : తెలంగాణలోనే మొట్టమొదటగా సిద్దిపేట జిల్లాలో కోవిడ్ ప్రొఫైల్ పరీక్షలను ఉచితంగా పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రూ. 5,500 విలువైన కోవిడ్ ప్రొఫైల్ పరీక్షల కోసం ఇప్పటి వరకూ పేద ప్రజలు ప్రైవేటు డయాగ్నోస్టిక్ కేంద్రాలను, ప్రైవేట్ ఆసుపత్రుల ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. టీ – డయాగ్నస్టిక్ హబ్లో ఇక నుంచి కొవిడ్ పరీక్షలు ఉచితంగా చేస్తామని, దీంతో పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గనున్నదని మంత్రి తెలిపారు.
తొలి విడతలో ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇన్ పేషంట్లకు ఉచిత పరీక్షలు చేయనున్నారు. విడతల వారీగా దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల ఆసుపత్రులలో రోగుల నుంచి శాంపిల్స్ సేకరించి టీ – డయాగ్నస్టిక్ హబ్లో పరీక్షలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు.
కోవిడ్ ప్రొఫైల్ పరీక్షలలో భాగంగా డి- డైమర్, పెరిటిన్, CRP, LDH, CBP వంటి పరీక్షలు చేయనున్నారు. డి- డైమర్ పరీక్షలు చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక మిషన్ను ఇప్పటికే టి – డయాగ్నస్టిక్ హబ్ లో ఇన్స్టాల్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి ఆవరణలో టీ – డయాగ్నస్టిక్ హబ్ లో ఉచిత కోవిడ్ ప్రొఫైల్ పరీక్షలు ప్రారంభం అయిన తర్వాత దశల వారీగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లలో ప్రభుత్వం అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.