హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వైద్యారోగ్య సంచాలకుడు (డీహెచ్) శ్రీనివాసరావు చెప్పారు. దాదాపు 10 వారాల తర్వాత రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య వంద దాటిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచించారు. కోఠిలోని డీపీహెచ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ర్టాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నదని అన్నారు.
దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య వారానికి 20,323 నుంచి 33,555కు, పాజిటివిటీ రేటు 0.7 శాతం నుంచి 2 శాతానికి పెరిగిందని చెప్పారు. తెలంగాణలో కేసుల సంఖ్య 355 నుంచి 555కు పెరిగిందని తెలిపారు. అయినప్పటికీ దవాఖానల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య దాదాపు సున్నా శాతంగా ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 8 వారాల నుంచి ఒక్క కొవిడ్ మరణం కూడా నమోదు కాలేదని తెలిపారు. ప్రస్తుత కేసుల పెరుగుదల మరో 4-6 వారాల పాటు ఉండొచ్చని చెప్పారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించని వారికి ఫైన్ వేసే పరిస్థితులు వస్తాయని అన్నారు.
కొవిడ్ కేసులు పెరుగడాన్ని నాలుగో వేవ్గా భావించవద్దని డీహెచ్ సూచించారు. వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున జరుగడం, సెకండ్, థర్డ్ వేవ్లతో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడం వంటి కారణాల వల్ల రాష్ట్రంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తకువని చెప్పారు. అంతేకాకుండా కరోనా పాండమిక్ దశ నుంచి ఎండమిక్ దశకు చేరుకున్నదని, ఇక రాబోయే 6-12 నెలల్లో సాధారణ జలుబు మాదిరిగా మారే అవకాశం ఉన్నదని అన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్లోనే కొత్త వేరియంట్లు వస్తున్నాయని, ఇవి సోకినవారిలో సాధారణ ఇన్ఫ్లూయెంజా లక్షణాలే కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటికీ బీఏ-2 వేరియంటే ఎక్కువగా ఉన్నదని, గత నెల రోజుల్లో 65 శాతం ఈ వేరియంటే కనిపించిందన్నారు. బీఏ 2.38 వేరియంట్ 3 శాతం, బీఏ-4 ఒక శాతం, బీఏ-5 రెండు శాతంగా నమోదయ్యాయన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల్లో కలిపి మొదటి డోస్ 105 శాతం, రెండో డోస్ దాదాపు 100 శాతం వేశామని డీహెచ్ చెప్పారు. అయితే 12-15 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్నదని చెప్పారు. త్వరలో విద్యాసంస్థలు తెరుస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు కచ్చితంగా తమ పిల్లలకు కొవిడ్ టీకాలు వేయించాలని సూచించారు. స్కూల్ యాజమాన్యాలు ఎంత మంది పిల్లలు టీకాలు వేసుకోలేదో గుర్తించి, సమీప మెడికల్ ఆఫీసర్ను సంప్రదిస్తే స్కూల్లోనే మెడికల్ క్యాంపు పెట్టి టీకాలు వేసే అవకాశం ఉంటుందన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ సూచించారు. జనవరి నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో 158 కేసులు నమోదయ్యాయని చెప్పారు. దోమలు, లార్వా నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలు కూడా ఇండ్లల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని కోరారు.
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 155 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 81, రంగారెడ్డిలో 42, మేడ్చల్ మల్కాజిగిరిలో 11, సంగారెడ్డిలో 8 కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 0.94 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 907 ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్ పేర్కొన్నది. ప్రస్తుతం మరణాలు సున్నాగా ఉండటం ఊరటనిచ్చే అంశం.