సిద్దిపేట : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏఎన్ఎం సబ్ సెంటర్లలోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రితో పాటు అక్కడ నిర్వహిస్తున్న కొవిడ్ వార్డును మంత్రి హరీశ్రావు బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లతో పాటు ఒక కోటి హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కొవిడ్ వార్డులకు ఆక్సిజన్ సదుపాయం కల్పించామన్నారు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే హోం ఐసోలేషన్లో ఉండాలని, లక్షణాలు తీవ్రంగా ఉంటేనే ఆస్పత్రిలో చేరాలని మంత్రి సూచించారు. అన్ని ఆస్పత్రుల్లో ఐసీయూ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇక టెస్టుల కోసం వచ్చిన వారితో మంత్రి హరీశ్రావు మాట్లాడారు.
సీఎం కేసీఆర్ మానస పుత్రిక కేసీఆర్ కిట్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ కిట్ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వ దవాఖానల్లో 22 శాతం మేర ప్రసవాలు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్య రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ జిల్లా దవాఖానలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది బాగా పని చేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు. దవాఖానలో నెలకు 400 డెలివరీలు చేస్తున్నారనీ తెలిపారు. గజ్వేల్ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే పసిరికలు, ఇతర ఆరోగ్య పరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అత్యవసర వార్డు చక్కగా పని చేస్తుందన్నారు. వైద్యులు పిల్లలకు మంచి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.