హైదరాబాద్ : తెలంగాణలో కొవిడ్ ఆంక్షలను ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. జనం గుమిగూడే అన్ని కార్యక్రమాలపై ఈ నెల 10వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. కొవిడ్ కట్టడిలో భాగంగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాదిలో జీవో నంబర్-1ను సీఎస్ సోమేశ్కుమార్ జారీ చేశారు. శనివారం ఆయన డీజీపీ మహేందర్రెడ్డి, ఉన్నత అధికారులతో రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనేక రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ వేరియంట్ కేసులు, కోవిడ్-19 కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన నివారణ చర్యలు కూడా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.
ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సభలకు సైతం అనుమతి ఇవ్వొద్దన్నారు. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్లో మాస్క్, భౌతికదూరం తప్పనిసరి అమలు చేయాలని ఆదేశించారు. విద్యా సంస్థల్లో సిబ్బంది, విద్యార్థులు మాస్క్లు పెట్టుకునేలా చూడాలన్నారు. మాస్క్ లేకపోతే రూ.వెయ్యి జరిమానా కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.