హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఆలోచనలకు రూపమిస్తూ అంకురాలుగా మలిచే ఔత్సాహికులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్ (కోవే) తెలంగాణ చేపట్టిన ఫెమ్ప్రెన్యూర్ కార్యక్రమానికి విశేష ఆదరణ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అనుసంధానించిన అన్ని ఇంజినీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాలేజీల విద్యార్థులు చేపట్టిన ఉత్తమైన ఆలోచనలు, స్టార్టప్లను గుర్తించారు. వీరిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం గా.. ఏటా నిర్వహించే ఫెమ్ప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా స్టార్టప్ల ఏర్పాటు, నిర్వహణకు అవసరమైన అవగాహన కల్పించారు.
కోవే చేపట్టిన ఫెమ్ప్రెన్యూర్-2024 ముగింపు వేడుకలు ఎర్రమంజిల్లోని ఎఫ్టీసీసీఐ భవన్లో మంగళవారం నిర్వహించారు. రాష్ట్రంలో స్టార్టప్లు నెలకొల్పే ఆలోచనలు కలిగి ఉన్న 34 బృందాలలో ఆరిం టిని ఉత్తమమైనవిగా ప్రకటించారు. వీటిలో వ్యవసాయం, ప్రకృతి విపత్తులు, మహిళా సంరక్షణ, స్ట్రీట్ఫుడ్, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల స్టార్టప్ ఆలోచనలతో వచ్చిన బృందాలకు నగ దు పురస్కారం, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో క్రియోటో సొల్యూషన్ సీఈవో సుమంత్ కృష్ణన్, కోవే తెలంగాణ ప్రెసిడెంట్ చేతన జైన్, యంగ్ కోవే చైర్మన్ శ్రీనిత్య పాల్గొన్నారు.