సంగారెడ్డి : ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ ఇద్దరు యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డికి చెందిన సీహెచ్ శ్రీనాథ్ రెడ్డి(32), సీహెచ్ రాఘవేణి మల్లిక(29) దంపతులు. శ్రీనాథ్ ఓ ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. మల్లిక కూకట్పల్లిలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పని చేస్తోంది. అయితే బుధవారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నారు యువ దంపతులు.
ఇవాళ ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టారు. ఫ్యాన్కు వేలాడుతున్న ఇద్దర్ని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక సమస్యలతోనే యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.