గోదావరిలో లభ్యమైన మృతదేహాలు
బూర్గంపహాడ్(భద్రాద్రి కొత్తగూడెం), ఆగస్టు 5: అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు మరణంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురు లేని జీవితం తమకెందుకని చివరికి ఆ దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఈసీఎల్కు చెందిన పమ్మి లక్ష్మణాచారి (55), హేమలత (48) దంపతుల కుమార్తె సాత్విక పది రోజుల క్రితం అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అప్పటి నుంచి కుమార్తె లేని జీవితం తమకొద్దంటూ మనోవేదనకు గురయ్యారు. పాల్వంచలో ఉన్న హేమలత సోదరుడు వేమనకుమార్ వారిని తన ఇంటికి బుధవారం తీసుకువచ్చాడు. వేమనకుమార్ పని నిమిత్తం బయటకు వెళ్లగా ఆ సమయంలో దంపతులిద్దరూ గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సూసైడ్ నోట్లో ‘ ఆ ఇంట్లో నా బిడ్డ లేని జీవితం మాకు వద్దు.. అందుకే చావడానికి వెళ్తున్నాం. సారీ మేముండం.. మా కోసం వెతకమాకండి.. నా బిడ్డకు అన్ని కార్యక్రమాలు మంచిగా చేయండి..’ అని రాసి ఇంట్లో లేఖ వదిలి వెళ్లారు. గురువారం రాత్రి బూర్గంపహాడ్ పంపు హౌస్ వద్ద ఆ దంపతుల మృతదేహాలు లభ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.