గజ్వేల్ రూరల్, ఏప్రిల్ 28: కూతురి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ఇంటికి వస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకొన్నది. సీఐ వీరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ పట్టణానికి చెందిన జగ్గయ్యగారి శ్రీధర్, లత దంపతులు. వీరి కూతురు హైదరాబాద్లోని నిజాంపేటలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. కూతురు పుట్టినరోజు కావడంతో బుధవారం సాయంత్రం ఆమె వద్దకు వెళ్లారు. రాత్రి వరకు అక్కడే ఉండి అర్ధరాత్రి సమయంలో కారులో గజ్వేల్కు బయలుదేరారు. శ్రీధర్ నడుపుతున్న కారు ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై రాణే కంపెనీ సమీపంలో ఒక్కసారిగా డివైడర్ను ఢీకొని అవతలి వైపున కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును బలంగా ఢీకొన్నది. ఈ ఘటనలో కారులో ఇరుక్కుపోయి శ్రీధర్ (42), లత (40) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే 108 సిబ్బందితో కలిసి ప్రమాదస్థలికి వచ్చి చూడగా.. కారులో దంపతుల మృతదేహాలు కన్పించాయి. మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి తదితరులు గురువారం ఉదయం గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.