హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వంటి విజనరీ కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ మాడల్ కావాలని, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా అమలు కావాలని అన్నారు. గోల్మాల్ గుజరాత్ మాడల్, బుల్డోజర్, డబుల్ ఇంజిన్లు అవసరం లేదని తెలిపారు. ఏడున్నరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ విజయాలు సాధిస్తే, ప్రధానిగా మోదీ వైఫల్యాలు మూటగట్టుకొన్నారని విమర్శించారు.
‘మేరా భారత్ మహాన్’ను నిజం చేయగలిగేది సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో బుధవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో.. ‘దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక భూమిక పోషించాలి’ అన్న తీర్మానాన్ని మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. దీన్ని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి బలపరిచారు. తీర్మానం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం అనంతరం తెలుగువారి చరిత్రను పరిశీలిస్తే ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినా ఇద్దరు మహానుభావులు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే పార్టీలను దశాబ్దాల పాటు నడపగలిగారని చెప్పారు. ‘రాజకీయాల్లో ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేస్తే.. సీఎం కేసీఆర్ హిస్టరీతోపాటు జాగ్రఫీని క్రియేట్ చేశారు. అన్ని రాష్ర్టాలకు సీఎంలు ఉంటే, తెలంగాణకు మాత్రం రాష్ర్టాన్ని తెచ్చిన సీఎం ఉన్నారు’ అని కొనియాడారు.
సీఎం కేసీఆర్ తన దక్షత, డైనమిజం, పరి పాలనతో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలిపారని శ్లాఘించారు. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ నేతలమంతా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. ‘చాలా మంది జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యాలు నిర్ణయించుకొంటారు. వాటిని చేరడం మాత్రం చాలా కష్టం. కానీ సీఎం కేసీఆర్ ధన్యులు. తెలంగాణ రాష్ట్రం కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ప్రజల మద్దతుతో సాధించుకొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు’ అని ప్రణబ్ ముఖర్జీ అన్నారని తెలిపారు. ఓసారి అరుణ్ జైట్లీ దగ్గరికి వెళ్తే ‘దేశంలో మంచి ఆందోళనకారులను చూశాం, మంచి పరిపాలకులను చూశాం. కానీ, కేసీఆర్ అరుదైన వ్యక్తి. ఆయన గొప్ప ఆందోళనకారుడే కాదు.. మంచి పాలకుడు కూడా’ అని ఆశీర్వదించారని వెల్లడించారు.
బంగారు తెలంగాణ మాడల్కు మంత్రి కేటీఆర్ అర్థం వివరించారు. ‘2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు, ఏడున్నరేండ్లలో 130 శాతం పెరిగి రూ.2.78 లక్షలకు చేరింది. దేశ సగటు మాత్రం రూ.1.43 లక్షల వద్దే ఉన్నది. రాష్ట్ర జీఎస్డీపీ అప్పుడు రూ.5 లక్షల కోట్లు ఉంటే.. ఏడున్నరేండ్లలో 128 శాతం పెరిగి రూ.11.5 లక్షల కోట్లకు చేరింది. ఆర్బీఐ ప్రకారం తెలంగాణ భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభాపరంగా 12వ స్థానంలో ఉన్నా.. కానీ దేశానికి అన్నం పెడుతున్న నాలుగు రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైసలతో బీజేపీ రాష్ర్టాల్లో పనులు అవుతున్నాయి. దేశ జనాభాలో మనం 2.5 శాతమే, కానీ ఆర్థికంగా 5 శాతం. రాష్ట్రంలో మత పిచ్చి లేదు, కుల పిచ్చి లేదు. విశ్వమానవ సౌభ్రాతృత్వం, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఇదే బంగారు తెలంగాణ మాడల్’ అని వివరించారు. సోచో ఇండియా అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
గోల్మాల్ గుజరాత్ మాడల్ను 2011-14 వరకు సోషల్ మీడియాలో ఊదరగొట్టి, దేశ ప్రజలను ఆగమాగం చేసి బీజేపీ కేంద్రంలో కూర్చున్నదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మోదీ ప్రధానిగా, కేసీఆర్ సీఎంగా దాదాపు ఒకేసారి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఏడున్నరేండ్లలో దేశం ఎన్నడూ చూడని సమ్మిళిత అభివృద్ధి, అరుదైన ‘బ్యాలెన్స్డ్ గ్రోత్ మాడల్’ను తెలంగాణ ప్రభుత్వం దేశం ముందు ఆవిష్కరిస్తే, కేంద్రానికి అంతులేని వైఫల్యాల చరిత్ర ఉన్నదని పేర్కొన్నారు. హర్ ఘర్ మే జహర్ అంటూ మోదీ ప్రతి మనసులో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. వోకల్ ఫర్ లోకల్ అని గొప్పలు చెప్తాడని, దేశంలో అంతర్భాగమైన తెలంగాణ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ను కడితే.. ప్రధానిగా ఎందుకు ప్రశంసించడం లేదు? అని ప్రశ్నించారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా భారత్ ఇంకా ఎదుగుతున్న దేశంగానే ఉన్నదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 1987లో చైనా, ఇండియా జీడీపీ 470 బిలియన్ డాలర్లుగా ఉంటే.. ప్రస్తుతం మన జీడీపీ 3 ట్రిలియన్లు, చైనాది 16 ట్రిలియన్లుగా ఉన్నదని తెలిపారు. మన తలసరి 1800 డాలర్ల దగ్గర ఉంటే, చైనా 9 వేల డాలర్లు పెరిగిందని వివరించారు. ‘మేరా భారత్ మహాన్’ అనే నినాదాన్ని నిజం చేసే నాయకుడు కావాలని దేశం కోరుకొంటున్నదని, దాన్ని తెలంగాణ అందిస్తుందని నమ్ముతున్నానని అన్నారు. వసుధైక కుటుంబంగా, అందమైన పూలబొకేలా ఉన్న దేశాన్ని కాపాడాలంటే సీఎం కేసీఆర్ వంటి టార్చ్బేరర్ కావాలని అన్నారు.
దేశం ఇప్పుడు మంచి నాయకుడి కోసం ఎదురుచూస్తున్నదని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచే సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనను భరించలేక ఎన్డీయేను తీసుకొస్తే.. దేశం పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైందని అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, ఈ నేపథ్యంలో దేశం తనను బంధవిముక్తి చేసే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నదని, ఆ సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని స్పష్టం చేశారు.