సదాశివపేట/సంగారెడ్డి : పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం సదాశివపేట మండల పరిధిలోని కోనాపూర్ గ్రామాన్ని సందర్శించారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రగతి వనం, డంపింగ్ యార్డు, వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాలను పరిశీలించారు. పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటారు. అనంతరం సందీప్కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉంచి అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమం తీసుకువచ్చారన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అధికారులు, ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల సలహాలు తీసుకుని బృహత్తరమైన కార్యక్రమం తీసుకువచ్చారన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం నాలుగో విడత పూర్తి చేశామన్నారు. వాటి ద్వారా పల్లెలు అభివృద్ధి చెందడంతో పాటు పారిశుధ్యం మెరుగుపడిందన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమం నిరంతరాయంగా ఉంటుందని, ప్రతి రోజు మన ఇళ్లను శుభ్రం చేసుకున్నట్లే గ్రామాన్ని శుభ్రం చేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్లకు నిబంధనలు తీసుకొచ్చామని, విధుల్లో నిర్లక్ష్యం చేసిన వారి పదవులు పోతాయన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాస్ రావు, డీపీఓ సురేష్మోహన్, ఏపీడీ జయదేవ్, డీఎల్పీఓ సతీష్రెడ్డి, పీఆర్ ఈఈ జగదీశ్వర్, ఎంపీడీఓ పూజా, ఎంపీఈఓ నారాయణ, కోనాపూర్ గ్రామ సర్పంచ్ శోభారాణి, ఎంపీటీసీ లలిత, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.