హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): బ్రాండెడ్ పేరిట కీళ్ల నొప్పులకు నకిలీ మందులు తయారు చేస్తున్న ముఠాను శుక్రవారం అదుపులోకి తీసుకొని, రూ.50 లక్షల నిల్వలను సీజ్ చేసినట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డీజీ కమలాసన్రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లిలో రక్షిత్ డ్రగ్స్ పరిశ్రమలో అక్రమంగా ‘డయాసెరిన్’తో ఔషధాలు తయారు చేస్తున్నట్టు గుర్తించామని చెప్పారు. కంపెనీపై దాడులు చేయగా, 9 డ్రమ్ముల్లో డయాసెరిన్ను నింపి అపరిశుభ్రంగా ‘సీడీఈ-1’ పేరుతో మందులు తయారు చేస్తున్నట్టు తేలిందని, అధికారులు 236 కిలో ల డయాసెరిన్ను సీజ్ చేశారని వివరించారు. అసిస్టెంట్ డైరెక్టర్ పీ రాము, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంగ్, అన్వేష్, సీహెచ్ కార్తిక్ శివ చైతన్య, ఏఎన్ క్రాంతికుమార్ పాల్గొన్నట్టు డీజీ తెలిపారు.