హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలో 310 ఫార్మసిస్టు పోస్టులకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) పరిధిలో 105 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శుక్రవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) పరిధిలోని 135 పోస్టులకు, డీఎంఈ పరిధిలోని 70 పోస్టులకు కౌన్సెలింగ్ జరుగనున్నది. వీరు త్వరలోనే ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా 369 ఫార్మసిస్ట్ పోస్టులకు 2018 జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో డీపీహెచ్ పరిధిలో 125, డీఎంఈ 96, టీవీవీపీలో 148 పోస్టులు ఉన్నాయి. అయితే, కోర్టు కేసుల కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఇందులో 310 పోస్టుల భర్తీకి న్యాయస్థానం తాజాగా అనుమతి ఇచ్చింది. మరో 59 పోస్టుల భర్తీని తాత్కాలికంగా వాయిదా వేయాలని సూచించింది. ఇదిలావుండగా, నియామక పత్రాలు అందుకోనున్న ఫార్మసిస్టు అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని కొనియాడారు. మంచి సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని మంత్రి సూచించారు.