హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని లేఖ ద్వారా సీఎంను గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనని కలిసి వారి పరిస్థితిని వివరించుకున్నారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో మన ఊరు- మన బడి కార్యక్రమం కింద సివిల్ పనులు పూర్తయ్యాయని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు దీనిని ధృవీకరించారని, రాష్ట్రం అంతటా మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పూర్తయిన సివిల్ పనులకు పెండింగ్ బిల్లులు రూ.361.350 కోట్లు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల (స్కూల్ పేరెంట్స్ కమిటీ) అవసరాలను తీర్చడం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్య కాబట్టి, పెండింగ్లో ఉన్న రూ.361.350 కోట్ల బిల్లులను విడుదల చేయాలని కోరారు. చిన్న, పేద కాంట్రాక్టర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సభ్యులు చేతి రుణాలు తీసుకుని ఈ పనులను పూర్తి చేశారని, బిల్లులు రాకపోవడంతో నేడు వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన లేఖలో తెలిపారు. పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా, మన ఊరు- మన బడి పథకం కింద రాష్ట్రం అంతటా పూర్తయిన సివిల్ పనులకు సంబంధించిన రూ.361.350 కోట్ల పెండింగ్ బిల్లులను అత్యంత ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని ముఖ్యమంత్రిని లేఖ ద్వారా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభ్యర్థించారు.