KCR | గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోనే ఆల్టైమ్ అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని.. ప్రస్తుతం దురదృష్టవశాత్తు వర్షాలు లేవని.. తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నల్గొండలోని నివాసంలో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ కింద, ఏఎంఆర్పీ, ఆయకట్టు కింద క్రాఫ్ హాలీడేలు ప్రకటించారని.. కొందరు అన్నదాతలు బోర్లు, బావుల కింద పంటలు సాగు చేస్తున్నారన్నారు.
భూగర్భ జలాలు అడుగంటాయని.. బావులు ఎండిపోయాయన్నారు. పొట్ట దశలో ఉన్న పంటలు అన్ని ఎండిపోతున్నాయన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని.. తెలంగాణ కాంగ్రెస్ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే 15 టీఎంసీలు నీటిని తరలించి.. ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని కోరుతున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కర్ణాటకతో మాట్లాడాలని.. పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
మార్చి తర్వాత తెలంగాణలో మంచినీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ పార్టీలు ప్రజల బాధలను ముందుగానే అర్థం చేసుకొని ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నడుం బిగించి వెంటనే సాగు నీటిని విడుదల చేయాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా ఎవరిని నిలబెట్టినా సహకారం అందిస్తానన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని.. సమన్వయంతోనే పని చేస్తేనే ఫలితాలు వస్తాయన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను పార్టీ నిర్ణయిస్తుందని.. ఎవరు గెలిచే అవకాశం ఉంటే వారికే టికెట్లు ఇస్తారన్నారు.