హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీఆర్ఎస్ తరఫున నామినేట్ అయిన, ఆ పార్టీ తరఫున గెలిచి వేరే పార్టీలోకి మారిన ఎమ్మెల్సీల విషయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. కూచుకుళ్ల దామోదర్రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి పార్టీ మారారని, వీరిద్దరి శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. దీనిపై చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చట్టపరమైన అంశాలను, గతంలో అనుసరించిన సంప్రదాయాల గురించి శాసనసభ కార్యదర్శితో చర్చించారు. న్యాయనిపుణులతో కూడా మాట్లాడారు.
అన్ని అంశాలను పరిశీలించిన తరువాతనే పార్టీ మారిన ఎమ్మెల్సీలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సభ్యత్వాలను రద్దు చేయాలని బీఆర్ఎస్ పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. వారిపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం జరుగుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ ఎమ్మెల్సీల అనర్హత అంశంపై మంగళవారం సమీక్షించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.