హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ఆఫీసుపై బీజేపీ కార్పొరేటర్లు దాడికి దిగడం దుర్మార్గమని, వాళ్లు బాధ్యత మరిచి ప్రవర్తించారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యలుంటే అధికారులు, మేయర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలేతప్ప దౌర్జాన్యానికి దిగడం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం మాసబ్ట్యాంక్లోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తన 30 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన చూడలేదని పేర్కొన్నారు. ఆఫీసులపై దాడులు చేస్తామంటే కుదరదని, ప్రభుత్వం చూస్తు ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ కార్పొరేటర్ల దాడిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా సమర్థించడం దారుణమని వ్యాఖ్యానించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేదిలేదని స్పష్టంచేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ను అన్నిరకాలుగా అభివృద్ధి చేశామని, కొత్త ఫ్లై ఓవర్లు, ఎల్ఈడీ లైట్లు, సీవరేజీ, పార్కులు.. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల నిర్వహణకు బీజేపీకన్నా తమకే ఉత్సాహం ఎక్కువగా ఉన్నదని చెప్పారు. కార్పొరేటర్లు అభివృద్ధికి సహకరించాలితప్ప ఆటంకంగా మారొద్దని హితవుచెప్పారు.