వికారాబాద్, మే 6, (నమస్తే తెలంగాణ): కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణ-కర్ణాటక మధ్య రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. కలెక్టర్ పౌసుమిబసు ఆదేశాల మేరకు గురువారం వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని రావులపల్లి, తాండూరు మండలంలోని కొత్లాపూర్ వద్ద చెక్పోస్టులను ఏర్పాటుచేశారు. తెలంగాణ నుంచి కర్ణాటక, కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చే వాహనాల రాకపోకలపై నిఘా పెంచారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్, రవాణాశాఖల ఆధ్వర్యంలో చెక్పోస్టుల వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చేవారికి చెక్పోస్టుల వద్ద పరీక్షలు చేయనున్నారు. జ్వరం లేకపోతేనే అనుతించనున్నట్టు అధికారులు తెలిపారు. వాణిజ్యపరమైన సరుకులు రవాణాచేసే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తనిఖీలు ఉండనున్నాయి. చిన్న వాహనాలు, ట్యాక్సీ కార్లు, ఇతర భారీ వాహనాల డ్రైవర్లను, ప్రయాణికులకు తప్పనిసరిగా టెంపరేచర్ గన్తో పరీక్షలు చేసిన తర్వాతనే అనుమతి ఇవ్వనునున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రం నుంచి అక్కడికి.. అక్కడి నుంచి ఇక్కడికి మెడిసిన్, ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ దందాను అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.