హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రెండేండ్లుగా కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న పర్యాటకరంగాన్ని ఒమిక్రాన్ వేరియంట్ మళ్లీ వణికిస్తున్నది. మరోసారి కరోనా విజృంభించవచ్చన్న భయాలతో విహార, తీర్థయాత్రలకు ప్రణాళిక వేసుకొన్నవాళ్లు చాలామంది విరమించుకొంటున్నారు. అనేకమంది పర్యాటకులు విమాన టికెట్లు రద్దు చేసుకొంటున్నారు. దేశంలోనే అతిపెద్ద ట్రావెల్ ఏజెన్సీలైన మేక్ మై ట్రిప్, థామస్ కుక్ గత రెండురోజుల్లోనే 20 శాతం బుకింగ్స్ రద్దయినట్టు వెల్లడించాయి. సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు కొంత కుదుటపడటంతో దాదాపు అన్ని దేశాలు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు తొలగించాయి. దీంతో చాలామంది క్రిస్మన్, నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో జరుపుకొనేందుకు, సంవత్సరాంత టూర్లకు బుకింగ్స్ చేసుకున్నారు. దుబా య్, యూరప్, అమెరికా వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలో మొదలైన ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా ఇజ్రాయెల్, బెల్జియం, కెనడా, యూఎస్ సహా 30 దేశాలకు చేరడంతో ఆయా దేశాలు.. ఇతర దేశాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు మొదలుపెట్టాయి. దీంతో టికెట్లు బుక్ చేసుకున్నవాళ్లు రద్దు చేసుకొంటున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కఠిన నిబంధనలు సైతం విహారయాత్రల రద్దుకు దారితీస్తున్నాయని ట్రావెల్ ఏజెన్సీలు చెప్తున్నాయి. దేశీయ పర్యటనలపైనా ఒమిక్రాన్ ప్రభావం కనిపిస్తున్నది.
తెలంగాణలో పర్యటించండి: మంత్రి శ్రీనివాస్గౌడ్
తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలున్నాయని, పర్యాటకులు స్వేచ్ఛగా ఆయా ప్రాంతాల్లో పర్యటించాలని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్లో ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ (ఐఐటీఎం) ఎగ్జిబిషన్ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేశామని తెలిపారు. చారిత్రక, వారసత్వ సంపద పరిరక్షణకు అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ కృషితోనే రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించిందని, యూఎన్డబ్ల్యూటీవో బెస్ట్ టూరిజం విలేజ్గా భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని గుర్తించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదిమానవుల నుంచి ఆధునిక ప్రపంచం వరకు అన్నిరకాల పర్యాటక ప్రాంతాలున్నాయని తెలిపారు. టెంపు ల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మించామని చెప్పారు. కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్రావు, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, మాల్దీవులు, అండమాన్ టూరిజం అధికారులు పాల్గొన్నారు.
టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నాం: ఉప్పల
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ వజ్రంలా వెలిగిపోతున్నదని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు. ఐఐటీఎం ఎగ్జిబిషన్ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను టూరిజం హబ్గా అభివృద్ధి చేయడంపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు.
రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవు: టీఎస్టీడీసీ ఎండీ
తెలంగాణలో ఒమిక్రాన్ ప్రభావం లేదని, ఇప్పటివరకు ఆ కేసులూ నమోదు కాలేదని టీఎస్టీడీసీ ఎండీ మనోహర్రావు తెలిపారు. ధైర్యంగా పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చని సూచించారు. ఫిబ్రవరి వరకు ఎక్కువగా పర్యాటకుల తాకిడి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పర్యటనకు వచ్చేవాళ్లు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని సూచించారు. మాస్క్ ఉంటేనే అనుమతించాలని సిబ్బందిని ఆదేశించామని ఎండీ మనోహర్రావు తెలిపారు.