విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
అత్తాపూర్లో ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ
రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తాను ఉన్నానని ముందుకు వచ్చి సాయం చేసే గొప్ప మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి అత్తాపూర్ డివిజన్లోని రేషన్ దుకాణంలో ప్రైవేట్ టీచర్లకు ఆమె బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా వ్యాప్తితో విద్యా సంస్థలు మూతపడటంతో ప్రైవేట్ టీచర్లు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ విషయం గుర్తించిన సీఎం కేసీఆర్ వారిని ఆదుకునేందుకు రెండు వేల నగదుతో పాటు 25 కిలోల బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఈ దిశగా ఆలోచించలేదన్నారు. మొదటి దశలో వలస కూలీల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం బియ్యం, నగదు పంపిణీ చేసిందని గుర్తు చేశారు.