Hyderabad | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మెటీరియల్ సైన్సెస్లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ కంపెనీ హైదరాబాద్ను కాదని తమిళనాడులో రూ. 1000 కోట్లతో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూరుకు దగ్గర్లో ఉన్న పిల్లాయిపక్కమ్లో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంట్ ఏర్పాటుతో 300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు జాతీయ ఇంగ్లిష్ పత్రిక ‘ది ఎకనమిక్ టైమ్స్’ మంగళవారం ఓ కథనం ప్రచురించింది. యాపిల్ ఫోన్లకు, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ డివైజ్లకు గొరిల్లా గ్లాస్ సరఫరాయే లక్ష్యంగా కార్నింగ్ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. గొరిల్లా గ్లాస్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా కార్నింగ్కు పేరున్నది. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, స్మార్ట్ఫోన్ దిగ్గజం యాపిల్కు ప్రముఖ సరఫరాదారుగా ఉన్నది.
దేశంలోనే తొలిసారి గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్ను ఏర్పాటుచేసేందుకు కార్నింగ్ ప్రతినిధులు గత ఆరేడు నెలలుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో రూ.934 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయాలని గత సెప్టెంబర్లో నిర్ణయించారు. తెలంగాణలో ఉన్న వ్యాపార సానుకూలతలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అనుబంధ తయారీరంగంలో పెట్టు బడుల కోసం కేసీఆర్ సర్కారు చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణను తమ ఉత్పత్తి ప్లాంట్కు కేంద్రంగా ఎంచుకొన్నట్టు కార్నింగ్ సంస్థ ప్రతినిధులు అప్పట్లో పేర్కొన్నారు. అయితే, తాజాగా ఈ ప్లాంట్ను హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిస్తున్నారు. ఇదే అంశంపై ఎకనమిక్ టైమ్స్తో పాటు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా.. అవుననే సమాధానం వచ్చింది. కాగా, హైదరాబాద్లో కార్నింగ్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా దాదాపు 800 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అప్పటి మంత్రి కేటీఆర్ పేర్కొనడం తెలిసిందే.
ప్రారంభం: 1851
కేంద్ర కార్యాలయం: న్యూయార్క్, అమెరికా
ఉద్యోగులు: 57,500
రెవెన్యూ: 1.2 లక్షల కోట్లు
తయారీరంగం: గాజు, సిరామిక్స్ సంబంధిత మెటీరియల్స్ తయారీ, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అవసరమైన గొరిల్లా గ్లాస్ల తయారీ.