నిజామాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్ట వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్రెడ్డి, సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాల్, పున్నా రాజేశ్వర్, ఎల్ నర్సింగరావుకు కమిటీలో స్థానం కల్పించారు. మండలాలవారీగా కూడా సమన్వయ కమిటీలను నియమించనున్నట్టు ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లడం, లోటుపాట్లు ఉంటే సరిచేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీయే లక్ష్యంగా పని చేయనున్నట్టు పేర్కొన్నారు.