హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో నిర్వహిస్తున్న జీ 20 వ్యవసాయ మంత్రుల సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సహకారం బాగున్నదని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో జీ 20 వ్యవసాయ సదస్సు సందర్భంగా గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంట నష్టాలను తగ్గించి, రైతులు ఎక్కువ ఆదాయం పొందేందుకు పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.
పంటలపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటున్నదని తెలిపారు. వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు, రైతులకు అవగాహన తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. పంజాబ్, హర్యానావంటి రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని, వీటిని దేశంలోని రైతులందరూ స్వాగతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటి వరకు రూ.1500 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
వాతావరణ మార్పుల వల్ల జరిగే పంట నష్టాలను తగ్గించేందుకు వాతావరణాన్ని తట్టుకొనే విత్తనాలను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. జీ 20 సమావేశాల్లో చర్చల ద్వారా వ్యవసాయ రంగంలోని సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుక్కొంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశాల ముగింపు రోజున (జూన్ 17) జీ 20 వ్యవసాయ మంత్రులతో కలిసి వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రకటనతోపాటు రోడ్మ్యాప్ను విడుదల చేస్తామని తెలిపారు. కాగా, హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనను కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి ప్రారంభించారు. తెలంగాణలో వ్యవసాయంలో వినూత్న పద్ధతులు అందరినీ ఆలోచింపజేశాయి.