హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉండాలని తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసుల సమావేశంలో నిర్ణయించారు. మూడు రాష్ర్టాల్లోని సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్లో డీఐజీ అంకిత్ గోయల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రామగుండం కమిషనర్, ఐజీ ఎం శ్రీనివాస్ అధ్యక్షత వహించి.. రాబోయే ఎన్నికలకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి చర్చించారు. చెక్ పోస్టుల వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి, మావోయిస్టుల కదలికలపై మూడు రాష్ట్రాల పోలీసులు పరస్పరం సమాచారాన్ని సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. సమస్యాత్మ గ్రామలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నాన్ బెయిలబుల్ వారెంట్ల విషయంలో మూడు రాష్ట్రాల పోలీసులు సహకరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.