ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. నియోజకవర్గం వ్యాప్తంగా రాత్రి నుంచి ఆగకుండా వానపడుతున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి చింతలమానేపల్లి మండలంలోని దింద వాగు ఉప్పొంగింది. దీంతో దింద, రన్వెల్లి, నాయకపుగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూరు మండలం సలుగుపల్లిలో తీగలఒర్రె వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. బెజ్జూరు, పెంచికలపేట మండలాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒడిశా- పశ్చిమబెంగాల్ తీరంలో వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తరాంధ్ర తీరం వద్ద కేంద్రీకృతమైందని.. ఇది రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారవచ్చని పేర్కొన్నది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.