వనపర్తి : జిల్లా కేంద్రంలో రూ.2.81 కోట్లతో వే సైడ్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పెబ్బేరు రోడ్లో వే సైడ్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. రైతులకే వే సైడ్ మార్కెట్లో అమ్మకాలకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా వే సైడ్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వం, అధికారులు కలిసి పని చేస్తేనే ప్రజలకు ఆశించిన ఫలితాలు లభిస్తాయన్నారు.
ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తే అంత త్వరగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దానికి తగినట్లు ముందుచూపుతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. కొత్త జిల్లాలు ఏర్పడి నేటికి ఐదేళ్లు అవుతుందన్నారు. ఈ రోజు గుర్తుండాలని వే సైడ్ మార్కెట్ కు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు.
త్వరలో కలెక్టరేట్, వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తాని మంత్రి తెలిపారు. వే సైడ్ మార్కెట్ లో 20 ప్లాట్ ఫార్మాల నిర్మాణంతో 78 మంది విక్రేతలకు అవకాశాలు ఉంటాయన్నారు. జిల్లా దవాఖానలో 50 బెడ్లు, నియోజకవర్గంలోని ఇతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇప్పటికే 50 బెడ్ల ఏర్పాటు చేశామన్నారు.
అప్పాయపల్లి సమీపంలో అదనంగా మంజూరైన పడకలు, ప్రహరీ గోడ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి సహకారం అందిస్తున్న సిజెంటా కంపెనీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సిజెంట సంస్థ తరఫున కేసీ రవి, సంస్థ ప్రతినిధులు వైద్యనాధన్, జగదీశన్, నారాయణ తదితరులు ఉన్నారు.