వడ్డేపల్లి, జూన్ 24: నాలుగు పదులు దాటినా పెండ్లి కాకపోవడంతో భగవంతుడి కరుణ కోసం ఏకంగా గుడినే నిర్మించాడు ఓ బ్రహ్మచారి. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లెడదిన్నె గ్రామానికి చెందిన కరణం మోహన్రావు, రాధాబాయికి ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు సత్యనారాయణ, చిన్న కొడుకు గిరిధర్కు వివాహాలు అయ్యాయి. రెండో కుమారుడు చక్రపాణికి ఇంకా పెండ్లి కాలేదు. డిగ్రీ వరకు చదువుకున్న చక్రపాణికి వ్యవసాయమంటే ఇష్టం. పంటల సాగులో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు.
ప్రస్తుతం చక్రపాణి ఊళ్లోనే ఉంటూ స్థానిక శివరామాంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. నాలుగు పదుల వయస్సు దాటినా పెండ్లి కావడం లేదు. పెండ్లి కోసం మొక్కని దేవుడు లేడు.. వెళ్లని గుడి లేదు. ఈ క్రమంలో కొందరు జోతిష్యుల సూచన మేరకు.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా గ్రామ శివారులోని తన సొంత స్థలం(14 సెంట్ల భూమి)లో షిర్డీ సాయిబాబా ఆలయ నిర్మాణానికి 2018 ఫిబ్రవరిలో శ్రీకారం చుట్టాడు. నాలుగేండ్లు రేయింబవళ్లు శ్రమించి.. దాతల సహకారంతో సుమారు రూ.16 లక్షలు వెచ్చించి ఆలయ నిర్మాణం పూర్తి చేశాడు. రూ.3 లక్షలతో నాలుగున్నర అడుగుల షిర్డీ సాయిబాబా విగ్రహాన్ని రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించాడు. 2021 ఆగస్టు 27న ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించాడు.