హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఊరిచుట్టూ వాగు.. వంతెన ఉండదు. నీటిలోకి దిగి నడవాల్సిందే. వానాకాలంలో యాతన అంతాఇంతా కాదు. విసిరేసినట్టున్న పల్లెలకు అధికారులూ రారు. వైద్యమూ అందదు. ప్రధాన నదులపైనా బ్రిడ్జిలకు గతిలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఊరుదీ ఇదే దుస్థితి. ప్రాణహిత నదిపై వంతెన నిర్మించాలన్న ఆలోచన ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏనాడూ రాలేదు. ఆరున్నర దశాబ్దాల సమైక్య పాలనలో చేయలేని పనిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 ఏండ్లలో ప్రభుత్వం చేసి చూపిస్తున్నది. గోదావరి, కృష్ణా, మంజీరా, మానేరు లాంటి ప్రధాన నదులపై భారీ బ్రిడ్జిలతోపాటు అనేక వాగులు, వంకలపై వందలాది వంతెనలను నిర్మిస్తున్నది.
ప్రజారవాణాకు వీలుగా రోడ్ కనెక్టివిటీని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిశానిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 519 వంతెనల నిర్మాణానికి రూ.2,650 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్లు ప్రత్యేక శ్రద్ధ, సంబంధిత శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిరంతర సమీక్షల ఫలితంగా ఇప్పటివరకు 1,405 కోట్ల నిధులతో 391 వంతెనలు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయం కలిగించేలా రోడ్ నెట్వర్క్ను పెంచింది. మిగిలిన 125 వంతెనల నిర్మాణం చివరి దశలో ఉన్నది. వీటిని త్వరలోనే పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో గోదావరికి అతి పెద్ద ఉపనది అయిన ప్రాణహితపై ఒక్క బ్రిడ్జినీ సమైక్య పాలకులు నిర్మించలేదు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ నదిపై వంతెన ఏదీ లేని కారణంగా అడవి బిడ్డలు, పరిసర గ్రామాల ప్రజలు పడవలు, తెప్పలపై ఆధారపడాల్సి వచ్చేది. వర్షాకాలంలో నది ఉగ్రరూపంలో ప్రవహిస్తున్నప్పుడు వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అత్యవసర సందర్భాల్లో నదిని దాటేందుకు ప్రాణాలకు తెగించాల్సి వచ్చేది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ప్రాణహితపై తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు ఆసిఫాబాద్ జిల్లాతో సంబంధాలు పెరుగుతాయని, రవాణా సదుపాయం పెరిగి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయించి గూడెం వద్ద భారీ వంతెనను నిర్మించారు. దీంతో ఆసిఫాబాద్ జిల్లాకు ఇతర రాష్ట్రాలతో కనెక్టివిటీ పెరిగింది. అడవి బిడ్డలకు సులువుగా ప్రయాణం చేయడానికి వీలు కలిగింది.
65 ఏండ్ల ఉమ్మడి పాలనలో గోదావరి, కృష్ణా, మానేరు, ప్రాణహిత, మంజీర నదులపై ప్రభుత్వం 13 బ్రిడ్జిలను మాత్రమే నిర్మించింది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 8 ఏండ్లలోనే ప్రధాన నదులపై 11 భారీ వంతెనలను, మూలవాగుపై మరో రెండు బ్రిడ్జిలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. మన నిధులు మనకోసమే ఖర్చు చేయాల్సివస్తే అభివృద్ధి ఎలా సాధ్యమనేది ఆచరణలో రోడ్లు, భవనాల శాఖ చేసి చూపించింది. వీటితోపాటు అనేక వాగులపై 378 వంతెనలను నిర్మించింది. వీటి నిర్మాణంతో మారుమూల ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ పెరిగింది. వర్షాకాలంలోనూ ప్రజలు సులువుగా రాకపోకలు సాగిస్తున్నారు.