హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): సీఆర్పీఎఫ్ పరీక్షపై సోషల్ వార్ నడుస్తున్నది. దక్షిణాదిపై ఆది నుంచి వివక్ష చూపుతున్న కేంద్రం.. ఉత్తరాదికి ఉద్యోగాలన్నీ కట్టబెట్టే కుట్ర చేస్తున్నదని యువత ఆరోపిస్తున్నది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో 9,212 ఉద్యోగాల భర్తీకి కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. 100 మార్కులకు పరీక్ష ఉండగా అందులో 25 మార్కులు హిందీ భాషా పరిజ్ఞానానికి కేటాయించింది.
ఉత్తరాదిన అన్ని రాష్ర్టాల్లో హిందీనే అక్కడి రాష్ట్రీయ భాష కావడంతో వారికి పరీక్ష సులభం. ఇక దక్షిణాదిలో ఎక్కువ మంది ఆ మార్కులు కోల్పోయే ప్రమాదం ఉన్నది. ‘హిందీకి ప్రత్యేకంగా 25 మార్కులు కేటాయించడం దారుణం. ఇతర ప్రాంతయ భాషలు, అక్కడి సంస్కృతులను అవమానించడమే. భారతదేశం వివిధ భాషల సమాహారమని మరిచిపోతే ఎలా?’ అంటూ నాయిని అనురాగ్రెడ్డి అనే యువకుడు ట్వీట్ చేశాడు. ‘హిందీ రాష్ర్టాలే దేశాభివృద్ధిలో భాగస్వామ్యం వహిస్తున్నాయా? బీజేపీకి దక్షిణాది ప్రజలంటే ఎందుకింత వివక్ష? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.