మహబూబ్నగర్ : తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్న విషయం విదితమే. వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తున్న క్రమంలో ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలన్న సంకల్పంతో అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్లో పాల్గొంటున్నారు. అయితే ఓ అమ్మాయి ఎత్తు తక్కువగా ఉండటంతో ఫిజికల్ ఈవెంట్స్లో నెగ్గెందుకు ఓ ఎత్తుగడ వేసింది. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ను ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు, ఐపీఎస్ ఆఫీసర్ ఎం చేతన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం ఓ యువతి రన్నింగ్లో క్వాలిఫై అయింది. అనంతరం ఎత్తు కొలిచే ఎలక్ట్రానిక్ పరికరం వద్దకు చేరుకుంది. ఇక పరికరంపై నిల్చొని ఎత్తు కొలుస్తున్న క్రమంలో సెన్సార్ స్పందించలేదు. దీంతో ఎస్పీ వెంకటేశ్వర్లు, ఎం చేతన కలిసి యువతి తలను పరిశీలించారు. ఆమె తలలో ఎమ్సీల్ అనే మైనాన్ని పెట్టుకుని వచ్చింది. దీంతో తల ఉబ్బెత్తుగా ఉండటంతో ఎత్తు సరిపోతుందని భావించింది యువతి. ఎత్తు తక్కువగా ఉండటంతో ఎమ్సీల్ మైనం పెట్టుకున్నట్లు యువతి తెలిపింది. కానీ అడ్డంగా బుక్కైంది. దీంతో యువతిని ఎస్పీ డిస్క్వాలిఫై చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి, ఎంపిక ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థి ఎత్తు కొలిచే ఎలక్ట్రానిక్ పరికరంపై నిల్చున్నప్పుడు తలపై, కాళ్ల కింద పూర్తిస్థాయిలో సరైన స్పర్శ ఉన్నప్పుడే సెన్సార్లు స్పందిస్తాయన్నారు. అదే విధంగా రన్నింగ్, ఇతర ఈవెంట్లలోనూ రేడియో ఫ్రీక్వెన్సీ విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.