Abhaya Hastham | హైదరాబాద్, జనవరి 10 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): విశాల్ హీరోగా వచ్చిన ‘అభిమన్యుడు’ సినిమా చూశారా? వ్యక్తిగత సమాచారంతో సైబర్ నేరగాళ్లు సామాన్యులను ఆర్థికంగా ఎలా దెబ్బతీస్తారన్న విషయాన్ని చిత్రంలో చూసి సగటు ప్రేక్షకుడు నిశ్చేష్టుడయ్యాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం పరిస్థితి కూడా అలాగే తయారైంది. 6 గ్యారెంటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అభయహస్తం’ ద్వారా అప్లికేషన్లు పెట్టుకొంటే, ఆ ఫారాలు రోడ్లమీద, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎక్కడపడితే అక్కడ కనిపించాయి. దీంతో దరఖాస్తుదారులు భయాందోళనలకు గురవుతున్నారు. దరఖాస్తుల్లో పేర్కొన్న తమ పేరు, ఇంటి అడ్రస్, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, కుటుంబ వివరాలు, గ్యాస్, కరెంటు మీటర్ నంబర్లు ఇలా దాదాపు అన్ని వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తు వ్యాపారమంతా పర్సనల్ డాటా (వ్యక్తిగత సమాచారం) చుట్టూతే తిరుగుతుందని, రానున్న రోజుల్లో భూములు, బంగారం కంటే డాటానే ఎంతో విలువైనదిగా మారబోతున్నదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. దీన్ని రుజువు చేస్తూ బ్యాంకింగ్, సెక్యూరిటీస్, మీడియా, ఎడ్యుకేషన్, హెల్త్కేర్, ఫార్మా, ఎంటర్టైన్మెంట్, ఇన్సూరెన్స్, లోన్స్, ట్రావెల్, గవర్నమెంట్, రిటైల్, హాస్పిటాలిటీ, ఈ-కామర్స్ ఇలా ప్రతి రంగంలో పర్సనల్ డాటా వినియోగం నిత్యకృత్యంగా మారింది. ఇంతటి కీలకమైన వ్యక్తిగత సమాచారం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో అంగడి సరుకుగా మారిపోయింది. మొన్న బాలానగర్ రోడ్ల మీద ‘అభయహస్తం’ దరఖాస్తులు కనబడితే, నిన్న ప్రైవేటు వ్యక్తుల ఇండ్లలో ప్రత్యక్షమయ్యాయి.
ఇప్పటికే ‘అభయహస్తం’ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి చేరినట్టు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీన్ని ధ్రువపరుస్తూ మొన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు చెందిన పలువురు దరఖాస్తుదారులకు ఫోన్లు చేసిన సైబర్ నేరగాళ్లు ‘అభయహస్తం’ గ్యారెంటీలకు ఎంపికయ్యారు.. ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పాలం’టూ ఒత్తిడి తెచ్చారు. తాజాగా నిజామాబాద్లోనూ సైబర్ నేరగాళ్లు తమ పంజాను విసిరారు. దీంతో తమ వ్యక్తిగత డాటా లీకేజీపై తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. కాగా, సాధారణంగా ఒక వ్యక్తి ఫోన్ నంబర్, ఆధార్ కార్డు వివరాలు ఎవరైనా తమకు ఇస్తే.. రూ. 25 చెల్లిస్తామని హైదరాబాద్లోని మాదాపూర్కు చెందిన ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడు తెలిపారు. అంతర్జాతీయంగా ఒక వ్యక్తి పర్సనల్ డాటా విలువ 102 డాలర్ల వరకు ఉంటుందని లింక్డిన్ గణాంకాల్లో వెల్లడైంది. ఈ లెక్కన.. ఒకవేళ ‘అభయహస్తం’ దరఖాస్తుల్లోని మొత్తం డాటా లీకైనట్టు తేలితే దాని విలువ అంతర్జాతీయంగా వేల కోట్లలో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.