హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రుద్దిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం రైతులను బాధల సుడిగుండంలోకి నెట్టేసింది. ఆధార్ నంబర్తో ఫోన్ నంబర్ను అనుసంధానం చేయని రైతుల ధాన్యం కొనవద్దని కేంద్రం ఆదేశించడంతో అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ నిబంధన కారణంగా చాలామంది రైతులు సకాలంలో ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్లిన రైతు తొలుత తన ఆధార్ నంబర్ను ఓపీఎమ్మెస్లో నమోదు చేయాలి. అప్పుడు ఆధార్తో అనుసంధానమైన ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని ఓపీఎమ్మెస్లో నమోదు చేసిన తర్వాతే ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలవుతుంది. అప్పటివరకు రైతులు పడిగాపులు కాయాల్సిందే! గతంలో ఈ తతంగం ఉండేది కాదు. గతంలో రైతు ఆధార్ నంబర్ను ఓపీఎమ్మెస్లో నమోదు చేసుకొని, బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసి, ధాన్యం కొనుగోలు చేసేవారు. దీనివల్ల రైతుల పేరిట దళారీలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తున్నారని కేంద్రం భావించింది. ఈ నేపథ్యంలో పారదర్శకత పేరిట రుద్దిన కొత్త నిబంధన నిజమైన రైతులకు గుదిబండగా మారింది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేకపోవడంతో పాటు రైతులకు డబ్బు చెల్లింపుల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కొత్త నిబంధనతో ఫోన్ నంబర్తో ఆధార్ను అనుసంధానం చేయలేని రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నా రు. పాస్బుక్ ఎవరి పేరుపై ఉంటే, వారి ఆధార్తోనే ఫోన్ నంబర్ అనుసంధానం చేయాలి. చాలామందికి ఫోన్లు లేవు. వీరంతా ఇప్పటికిప్పుడు మొబైల్ ఫోన్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆధార్తో ఫోన్ నంబర్ అనుసంధానం కోసం బ్యాంకులు, మీ-సేవ కేంద్రాలు, పోస్టాఫీసుల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. దీంతో ఇటు ధాన్యం అమ్ముకోవాలో అటు ఆధార్ అనుసంధానం కోసం క్యూలో నిల్చోవాలో అర్థంకాని దుస్థితి. తెలంగాణ వ్యవసాయశాఖ సర్వే నంబర్ల వారీగా పంట వివరాలను సేకరించింది. ఏ రైతు, ఏ సర్వే నంబర్లో, ఏ పంట, ఎన్ని ఎకరాల్లో వేశారనే రికార్డులున్నాయి. వీటిని పౌరసరఫరాల అధికారులు ఓపీఎమ్మెస్కు అనుసంధానం చేశారు. ఈ వివరాల ప్రకారమే రైతులు ధాన్యం తీసుకొనిరావాలి. ఎకరానికి గరిష్ఠంగా 30 క్వింటాళ్ల వరకు కొనుగోలుచేస్తారు. ఎక్కువ తీసుకొస్తే.. విచారణ జరిపిన తరువాతే కొనుగోలు చేస్తున్నారు. మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,400 కొనుగోలు కేంద్రాల ద్వారా 15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.