హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తాను సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ.. అసెంబ్లీలో వామపక్ష పార్టీల ప్రతినిధిగా ఉంటానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. అక్రమ కేసులు, ఉపా చట్టాలకు వ్యతిరేకంగా గొంతు వినిపిస్తానని, ప్రగతిశీల శక్తుల తరఫున నిలుస్తానని తెలిపారు. హైదరాబాద్ మఖ్ధూంభవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అస్థిత్వమే నిర్బంధాలు, అణచివేతలు, నిరంకుశత్వానికి వ్యతిరేకమని, నిజాం నవాబు క్రూర రాచరిక పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ రైతాంగ సాయుధ పోరాటాన్ని సాగించి తెలంగాణను విముక్తి చేసిందని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు ఎటువైపు ఉంటే, అటు వైపు అధికారం వచ్చే అవకాశం ఉంటుందనేది స్పష్టమైందని అన్నారు. మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.