హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్గా రేవంత్, ఎంపీ కోమటిరెడ్డి భేటీపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హన్మంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు రెడ్లు కలిశారు.. ఇద్దరు రెడ్లు కలవడం గొప్ప కాదని, వాళ్లంతా చుట్టాలే అని వ్యాఖ్యానించారు. అలాగే సీఎం కేసీఆర్ బర్త్డే రోజు తెలంగాణ కాంగ్రెస్ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడంపై తప్పుబట్టారు. బర్త్డే రోజు శాపనార్థాలు పెట్టడం సరికాదని హితవు పలికారు. శాపనార్థాలు ఆడవాళ్లు పెడుతారన్నారు. రాబోయే రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు నిధులు ఎక్కువ కేటాయించాలని, కొత్త జిల్లాల్లో స్టేడియాలు నిర్మించాలని సూచించారు. డ్రగ్స్ను నిర్మూలించేందుకు స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయాలన్నారు.
ఇదిలా ఉండగా.. రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మధ్య పొసగడం లేదు. ఇద్దరు పలు సందర్భాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా ఇద్దరు నేతల మధ్య సఖ్యత లేదన్నది హస్తం పార్టీ చెబుతున్న మాటలే. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్తో సన్నిహితంగా మెదిలారు. ఈ నేపథ్యంలో ఆయనపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీహెచ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.