హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): గురివింద గింజ తన నలుపు ఎరుగదన్నట్టున్నది కాంగ్రెస్ వ్యవహారం. రాష్ట్రంలో భూముల అమ్మకాలను మొదలుపెట్టిందే హస్తంపార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో భూముల విక్రయాల పరంపర కొనసాగింది. ఐదేండ్లలో ఏకంగా 88,500 ఎకరాలను అమ్మేశారు. ఇందులో అత్యధిక శాతం కాంగ్రెస్ నేతలకు, వారి అనుచరులకు దక్కినవే. ఆ నిధులతో నీటిపారుదల ప్రాజెక్టులు కడుతున్నామని బిల్డప్ ఇచ్చారు. జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ నేతలు ధనయజ్ఞం చేశారు. అలాంటి కాంగ్రెస్ గురవింద గింజలు.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా, కఠిన నిబంధనలతో భూములు వేలం వేసేందుకు సిద్ధమైతే.. తమ చరిత్రలోని నల్లదనాన్ని మరిచిపోయి విమర్శలు చేస్తున్నారు.
వెయ్యి మందికి రూ.లక్ష కోట్ల భూములు
ఉమ్మడి ఏపీలో 2006 నుంచి 2011 వరకు వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో మొత్తం 88,500 ఎకరాల భూములను అమ్మేశారు. ఇందులో వక్ఫ్, సర్ఫేకాస్ భూములున్నాయి. ఇవన్నీ నాటి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనివే. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.లక్ష కోట్లు జమయ్యాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నది. కాగ్ నివేదిక ప్రకారం.. 88,500 ఎకరాలను కొనుగోలు చేసింది కేవలం 1,027 మంది. అంటే సగటున ఒక్కొక్కరికి 86 ఎకరాలు దక్కాయి. ఒక్కో ఎకరం సగటున రూ.కోటి పలికింది. హైదరాబాద్ పరిధిలోని ఒకటి రెండు చోట్ల మినహా మిగతా భూములన్నింటినీ మార్కెట్ రేటు కన్నా చాలా తక్కువ ధరకు కట్టబెట్టేశారని అర్థమవుతున్నది. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతి దశలోనూ పకడ్బందీ చర్యలు తీసుకున్నది. గంపగుత్తగా కాకుండా లేఔట్లు వేసి విక్రయిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించింది. ఆసక్తి ఉన్న ఎవరైనా పాల్గొనేలా ఓపెన్ బిడ్డింగ్ నిర్వహిస్తున్నది. కొనుగోలు చేసినవారికి ఇబ్బందులు తప్పించేందుకు ముందస్తుగానే భవన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నది.
యూపీఏ ప్రభుత్వానిదీ ‘అమ్మకం’ బాటే
కేంద్రంలో మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సైతం 2004-14 మధ్య కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలను కొనసాగించింది. వివిధసంస్థల నుంచి మొత్తం 42 సార్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. సుమారు రూ.1.69 లక్షల కోట్లను సమీకరించారు. ఒకే సమయంలో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో నిరాటంకంగా భూములను, ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను అమ్మిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. ఆ డబ్బుతో ఎన్ని కుంభకోణాలకు పాల్పడ్డారో, ఎవరెవరు లబ్ధి పొందారో ప్రజలందరికీ తెలుసు. పంచభూతాల్లో సైతం కుంభకోణాలకు పాల్పడిన ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిన భూముల వేలంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం.
జలయజ్ఞం పేరిట నాడు ధనయజ్ఞం
సంక్షేమపథకాలు, జలయజ్ఞం కోసం భూములను అమ్ముతున్నట్టు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. రూ.లక్ష కోట్లలో ఎక్కువశాతం జలయజ్ఞానికి ఖర్చుచేసినట్టు చెప్పింది. జలయజ్ఞంలో 23 ప్రాజెక్టులను చేపట్టింది. ఇవి శంకుస్థాపనలే తప్ప ప్రారంభానికి నోచుకోలేదు.ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ నేతలకు చెందిన సంస్థలు అడ్డగోలుగా దోచుకున్నాయి. పనులు మాత్రం పూర్తికాలేదు. ఇక్కడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయమే చేసింది. జలయజ్ఞంలో భాగంగా 12 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడితే.. ఇందులో తెలంగాణలో ఉన్నవి కేవలం మూడు. ఇందులోని ప్రాణహిత-చేవెళ్ల ఎన్నటికీ పూర్తికాని, చుక్క నీళ్లు కూడా ఇవ్వలేని ప్రాజెక్టు అని, కేవలం డబ్బులు కురిపించే పథకమని అందరికీ తెలుసు. అందుకే తెలంగాణ ప్రభుత్వం దీనిని రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా మార్చింది. రికార్డు సమయంలోనే పూర్తి చేసి ప్రజలకు ఫలాలు అందించింది.