బహిర్గతమైన భట్టి, రేణుక వర్గపోరు
ఖమ్మం పార్టీ ఆఫీస్లో తన్నుకొన్న కార్యకర్తలు
మామిళ్లగూడెం, ఏప్రిల్ 26: కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి రచ్చకెక్కారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సాక్షిగా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. వరంగల్ రైతు సంఘర్షణ సభకు సంబంధించి కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు మంగళవారం ఖమ్మం నగరానికి రేవంత్రెడ్డి వచ్చారు. కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేవంత్, మల్లు భట్టివిక్రమార్క, రేణుకాచౌదరిలో హాల్లోకి రాగానే రెండు వర్గాల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు.
ఒకరినొకరు తోసుకుంటూ దుర్భాషలాడుకున్నారు. కార్యకర్తలు, నాయకులను లోపలికి రాకుండా అడ్డుకోగా.. మీటింగ్ హాల్ అద్దాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. కుర్చీలను పగులగొట్టారు. పలువురు కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. భట్టి విక్రమార్క, రేవంతరెడ్డిలు కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేసినా ఘర్షణ వాతావరణం తగ్గలేదు. దాంతో మీడియా సమావేశం నుంచి బయటికెళ్లారు. 10 నిమిషాలకు మీడియాతో మాట్లాడేందుకు రేవంత్, భట్టీ, రేణుకాచౌదరి వచ్చినా.. అదే పరిస్థితి కొనసాగింది. గందరగోళ పరిస్థితిలోనే రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు.