వరంగల్: కాంగ్రెస్ హయాంలో వరంగల్ పట్టణానికి చాలా అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. పట్టణ ప్రజలకు తాగునీటికి కూడా కటకట ఉండేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక మిషన్ భగరీరథ కార్యక్రమంతో ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి తాగే నీటి సరఫరా చేస్తున్నామని, వరంగల్ ప్రజలకు ఇప్పుడు తాగే నీటి గోస లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వరంగల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
‘కాంగ్రెస్ అసమర్థ పాలనవల్ల వరంగల్ పట్టణంలో తాగు నీళ్లకు కరువు ఏర్పడింది. తెలంగాణ రాకముందు తాగు నీళ్లకు గోస ఉండె. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నయ్. నిజాం కాలంలో పెట్టిన అజాంజాహీ మిల్లును కాంగ్రెస్ పార్టీ అమ్మేసింది. బీఆర్ఎస్ వచ్చినంక వరంగల్ దగ్గరలోనే బ్రహ్మాండమైన టెక్స్టైల్ పార్కును పెట్టుకున్నం. చాలా పెద్దపెద్ద కంపెనీలు వచ్చినయ్. ఏడాది, రెండేండ్లలో ఆ టెక్స్టైల్ పార్కులో లక్షల మంది ఆడవాళ్లు, మగవాళ్లకు ఉద్యోగాలు రాబోతున్నయ్’ అన్నారు.
‘వరంగల్ పట్ణణం కూడా అద్భుతంగా తీర్చిదిద్దబడుతున్నది. దుమ్ముధూళి ఉండే వరంగల్ పట్టణంలో ఇయ్యాల బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నయ్. బ్రహ్మాండమైన సదుపాయాలతో నిర్మాణాలు జరుగుతున్నయ్. విద్యారంగంలో పేద పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టినం. వాటిని జూనియర్ కాలేజీలుగా మార్చినం. ఇకముందు డిగ్రీ కాలేజీలుగా కూడా చేసుకోబోతున్నం. వైద్య రంగంలో కూడా పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసుకున్నం. వరంగల్ పట్టణంలో కాళోజీ పేరు మీద తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నం’ అని సీఎం చెప్పారు.
‘వరంగల్ పట్టణానికి ప్రధాన సమస్య ఏందంటే రైల్వే లైన్ అడ్డం. ఆ రైల్వే లైన్ మీద కనీసం ఆరు బ్రిడ్జిల నిర్మాణం జరిగితే ఈస్ట్, వెస్ట్ ప్రజలు అటు, ఇటు రాకపోకలు సాగించుడు సులువైతది. వచ్చే టర్మ్లో తప్పనిసరిగా ఆ ఆరు బ్రిడ్జిల నిర్మాణం చేసే బాధ్యత నాదని మనవి చేస్తున్నా. ఇప్పటికే ఒక పక్కన నేషనల్ హైవేలో భాగంగా బ్రహ్మాండమైన పెద్ద బైపాస్ రోడ్డు వచ్చింది. మరో పక్క రింగు రోడ్డును కూడా కంప్లీట్ చేస్తే.. అద్భుతమైన రింగు రోడ్డు వరంగల్ పట్టణానికి వస్తది. హుడా ఆధ్వర్యంలో గూడా అన్ని రకాలుగా వరంగల్ మాస్టర్ ప్లాన్ తయారైతున్నది. దాంతో ఈ నగరం బ్రహ్మాండంగా ఉంటది’ అని తెలిపారు.