హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో విజయంతో మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం టీఆర్ఎస్ వశమైంది. 2018 తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ గెలిచి టీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించింది. టీఆర్ఎస్ పుట్టిన తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఆలేరు నియోజకవర్గం మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికతో జిల్లా మొత్తం గులాబీ జెండా రెపరెపలాడింది. ఒకప్పుడు తమ పార్టీకి కంచుకోటగా చెప్పుకొని, తమకు ఎదురే లేదని ఉమ్మడి నల్లగొండ జిల్లాను శాసించిన కాంగ్రెస్ నేతలంతా.. టీఆర్ఎస్ చేతిలో మట్టికరిచారు. కారు జోరును అందుకోలేక పరాభవం పాలయ్యారు. వరుసగా ఆరు సార్లు, ఏడుసార్లు గెలిచి జిల్లాను శాసించిన యోధులందరి రాజకీయ జీవితం ముగిసిపోయే పరిస్థితి నెలకొన్నది.
కాంగ్రెస్ జీరో..
రాష్ట్రంలో కాంగ్రెస్కు బలంగా ఉన్న నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యే కూడా లేని దుస్థితి నెలకొన్నది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ 6 స్థానాల్లో గెలువగా.. కాంగ్రెస్ 5, సీపీఐ ఒకటి గెలుచుకొన్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన కుందూరు జానారెడ్డి ప్రతిపక్ష నేతగా పనిచేశారు.. హుజూర్నగర్ నుంచి గెలుపొందిన ఉత్తమ్కుమార్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు స్థానాలకు పరిమితమైంది. మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, నకిరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య, హుజూర్నగర్ నుంచి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి గెలుపొందారు. ఉత్తమ్కుమార్రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి, ఎంపీగా గెలుపొందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో కాంగ్రెస్ తరపున ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేసి ఓడిపోయారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరారు. జిల్లా నుంచి ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మిగిలిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరి.. రాజీనామా చేసి ఉప ఎన్నికతో ఓటమిని కోరి తెచ్చిపెట్టుకొన్నారు.
1994లో జిల్లాలోని 12 స్థానాలలో 5 టీడీపీ, 3 సీపీఎం, 3 సీపీఐ గెల్చుకోగా ఒకరు ఇండిపెండెంట్ విజయం సాధించడంతో కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రామిరెడ్డి దామోదర్రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకొని ఆ పార్టీ పరువు దక్కించుకొన్నది. ఇప్పుడు జిల్లా నుంచి కాంగ్రెస్ ఖాళీ అయింది. సీఎల్పీ, పీసీసీ, మంత్రి వంటి పదవులు నిర్వహించిన దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు.
ఉమ్మడి నల్లగొండలో హ్యాట్రిక్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018 సాధారణ ఎన్నికల తర్వాత మూడు ఉప ఎన్నికలు జరిగాయి. మూడు ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయంతో హ్యాట్రిక్ సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నేత ఉత్తమ్కుమార్రెడ్డి 2019లో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పోటీచేశారు. ఎంపీగా గెలిచాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికలో తన భార్య పద్మావతిని పోటీ చేయించారు. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి బరిలో నిలిచి విజయం సాధించారు. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.
నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి 2018లో గెలుపొందిన నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మృతిచెందగా, 2021లో ఉపఎన్నిక జరిగింది. నర్సింహయ్య తనయుడు భగత్ టీఆర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఇక్కడ గులాబీ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. మునుగోడులో 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడమే కాక.. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు జిల్లా మొత్తం గులాబీ వనంలా అద్భుతంగా మారింది.
నీలగిరిలో గత ఎన్నికలు.. రాజకీయ చరిత్ర
కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం
అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు జరిగిన మునుగోడు ఉప పోరులో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోవడంతో హస్తం పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో పడ్డాయి. ఇప్పటికే అన్ని ఎన్నికల్లో వరుస ఓటములను మూటగట్టుకున్న కాంగ్రెస్ మరొకటి తన ఖాతాలో పడటంతో ఆత్మైస్థెర్యాన్ని కోల్పోతున్నాయి. కాంగ్రెస్లో ఉద్ధండులు ఉన్నా అంతంత మాత్రంగానే పోటీ ఇవ్వటం, స్టార్ క్యాంపెయినర్గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లాంటి వారు సహకరించకపోవడం కార్యకర్తల్లో ఆత్మన్యూనతకు కారణమవుతున్నది.
వరుస ఎన్నికల్లో ఓటమి..
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతాన్ని కూడా గణనీయంగా కోల్పోతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 28.43% , లోక్సభ ఎన్నికల్లో 29.48 % ఓట్లు సాధించిన కాంగ్రెస్.. దుబ్బాక ఉప ఎన్నికలో 13.48% ఓట్లు రాగా, హుజూరాబాద్లో 1.46% ఓట్లే తెచ్చుకొన్నది.