Power Cuts | జగిత్యాల, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తమ ప్రభుత్వం క్షణకాలం కూడా పోకుండా విద్యుత్తును సరఫరా చేస్తున్నదని గొప్పలు చెప్పే కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డికి వాస్త వం బోధపడింది. ఆయన స్వయంగా పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో 40 నిమిషాలపాటు కరెంటు పోవడంతో ఉక్కపోతకు గురయ్యారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 303 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత హాజరయ్యారు. ఉదయం 10 గంటలకే ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు వేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో కరెంటు సరఫరా నిలిచిపోగా సభ ప్రారంభమయ్యే సమయానికి కూడా సరఫరాను పునరుద్ధరించలేదు. అధికారిక కార్యక్రమం ఉందని, కరెంటు సరఫరా పునరుద్ధరించాలంటూ అధికారులు జగిత్యాల అర్బన్ తహసీల్దార్ వరంధన్ను ఫోన్లో సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది.
కాసేపటి తర్వాత జీవన్రెడ్డే స్వయంగా అధికారులకు ఫోన్చేసి కరెంటు ఎందుకు పోయిందని ఆరాతీశారు. ఇది అధికారిక ప్రోగ్రాం అని, తొందరగా పునరుద్ధరించాలని పదేపదే కోరారు. అరగంట గడిచినా కరెంటు జాడ లేకపోవడంతో మరోమారు ఫోన్ చేసి ‘ఏమైంది బాబు.. ఇం కా కరెంటు రాలేదు’ అని ప్రశ్నించారు. అధికారులు ఆయనకు ఏం చెప్పారన్న విషయం తెలియరాలేదు కానీ, ‘ఏపిచ్చేసెయ్ తర్వాత చూసుకుందాం’ అని చెప్పడం వినిపించింది. దాదాపు 40 నిమిషాలపాటు కరెంటు రాకపోవడంతో అక్కడివారు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఉక్కపోతతో అల్లాడిపోయారు. అధికారిక సమావేశంలో జనరేటర్, చార్జింగ్ మైక్, తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.