KTR | గతంలో బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా బహుజనులకు వారి న్యాయమైన వాటాను ఇచ్చేది బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ అన్నారు. Gift A Smile కార్యక్రమంలో భాగంగా పరకాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లు పంపిణీ చేసిన కేటీఆర్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీలతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సెట్ అవుతారని చెప్పారు.
పరకాల నియోజకవర్గంలో ఉన్న 55 ఎంపీటీసీల్లో 58వ శాతం టికెట్లను అంటే 32 ఎంపీటీసీ స్థానాలను రేవంత్ రెడ్డి గాఢ నిద్రలో ఉన్నప్పుడే బీసీ సోదరులకు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. ఇంతేకాదు 109 సర్పంచులలో 49 శాతం అంటే సుమారు 49 స్థానాలను బీసీలకు ఇవ్వడంతో పాటు ఆరు జడ్పీటీసీల్లో 3 స్థానాలు, ఆరు ఎంపీపీలో 3 స్థానాలను బహుజనులకే ఇచ్చామన్నారు.
దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్క్ లో 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కీటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తాము చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలన్న కాంగ్రెస్ గుండాయిజంతో పరిశ్రమలు పారిపోయే పరిస్థితి దాపురించిందన్నారు. కాకతీయ టెక్స్ టైల్ పార్కులో కాలువ నిర్మాణానికి జనవరిలో రూపొందించిన 137 కోట్ల రూపాయల అంచనాలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహంతో 297 కోట్ల రూపాయలకు పెరిగాయన్నారు. కాలువ నిర్మాణం పేరుతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు 167 కోట్ల రూపాయలు దోచుకోవాలనుకున్నారని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు కు పరిశ్రమలను తెప్పించి తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అనుకుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని నిలువు దోపిడి చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించకపోతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న దోపిడీ ఆగదన్న కేటీఆర్, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అక్రమాలపై నిలదీస్తామన్నారు.
తెలంగాణ లోని ప్రతీ ఆడబిడ్డకు రాష్ట్ర ప్రభుత్వం 50 వేల రూపాయలు బాకీ ఉన్నదని కేటీఆర్ అన్నారు. చారాణ కోడికి బారాణ మసాలా అన్నట్టు స్వయం సహాయక బృందాలకు 3000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన రేవంత్ ప్రభుత్వం కేవలం 300 కోట్లు ఇచ్చి సంబరాలు చేసుకోమంటున్నదని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు సమ్మక్క- సారక్క, రాణి రుద్రమ వారసురాళ్లయిన వరంగల్ ఆడబిడ్డలు కర్రు కాల్చి వాత పెట్టాలని సూచించారు. మొన్న పార్లమెంటు ఎన్నికలప్పుడు రైతుబంధువేసి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని మళ్లీ రైతుబంధు వేశారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ కండువా కప్పుకుని మీ ఇంటికి వచ్చే బీఆర్ఎస్ క్యాడర్ ను కేసీఆరే వచ్చిండని భావించి కడుపులో పెట్టుకొని ఆశీర్వదించండని కోరారు.