Congress | హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వేర్వేరు కేసుల్లో ఇద్దరికీ నోటీసులు ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతుండడంతో దాని నుంచి తప్పించుకునేందుకు కాషాయ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారట. పోలింగ్కు ఒకట్రెండు రోజుల ముందు ఈడీ వారికి తాఖీదులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో దాని నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి దగ్గర కావాలని యోచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. బీజేపీతో టచ్లోకి వెళ్లిన ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎంపీకూడానని, అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయనకు ఈడీ నుంచి నోటీసులు అందినట్టు సమాచారం. ఇప్పుడాయనను ప్రశ్నించేందుకు సమన్లు కూడా ఇవ్వనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆయన సన్నిహితుడు లోక్సభ బరిలో నిలవడంతో ఆ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందని భయపడుతున్నట్టు సమాచారం.
రుణం ఎగవేత కేసులో ఎంపీ
బీజేపీతో టచ్లోకి వెళ్లిన ఎంపీ రుణం ఎగవేత కేసులో ఈడీ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆయనపై గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ ఫిర్యాదు ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగుతున్నదని సమాచారం. అదే జరిగితే తన గెలుపు కష్టమేనని వారు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరూ తమకు తెలిసిన మార్గాల ద్వారా అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వశర్మను ఆశ్రయించి చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతున్నది.
అధిష్ఠానాలు గుర్రు
కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ బీజేపీతో టచ్లోకి వెళ్లిన విషయం తెలిసిన ఇరు పార్టీల అధిష్ఠానాలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. తమ అనుమతి లేకుండా చర్చలు జరపడంపై బీజేపీ, ఈ విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని కాంగ్రెస్ ఆగ్రహంతో ఉన్నాయని తెలిసింది. ఆయా పార్టీల రాష్ట్ర ఇన్చార్జీలు వారిపై ఓ కన్నేసి ఉంచినట్టు సమాచారం. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.