మునిపల్లి, నవంబర్ 17: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లోనికుర్దు గ్రామంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకొని ఓ హోటల్ వద్ద ఛాయ్ తాగుతుండగా, అదే గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ గొడవ సృష్టించారు. ఎమ్మెల్యేపై దౌర్జన్యానికి దిగిన కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆవేదన చెందిన ఎమ్మెల్యే గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
కాంగ్రెస్ నాయకుల గూండాయిజం నశించాలంటూ డిమాండ్ చేశారు. అందోల్ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న దామోదర రాజనర్సింహకు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా.. తాను చేస్తుంటే ఓర్వలేక అడ్డుకోవడం తగదని అన్నారు. పదేండ్ల నుంచి అందోల్ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉంటున్నారని, ఎన్నికలు రాగానే ప్రజల మధ్య చిచ్చుపెట్టి గొడవలు సృష్టించడం దామోదరకు తగదని హితవు పలికారు. ‘ఇంకెన్నాళ్లు నీ రౌడీయిజం’ అంటూ దామోదర రాజనర్సింహపై మండిపడ్డారు.